Welcome To GK BITS IN TELUGU Blog
జాతీయ విద్యా విధానం 2020 - భారత ప్రభుత్వం(NATIONAL EDUCATION POLICY 2020 - GOVERNMENT OF INDIA)
- "డాక్టర్ కె. కస్తూరి రంగన్ కమిటీ" (Dr. K.KASTURI RANGAN COMMITTEE) రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానానికి 2020 జూలై 29న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
- దేశంలో 34 ఏళ్ల తర్వాత విద్యారంగంలో కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నాయి.
- ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు.
- ఇకమీదట 'మానవ వనరుల అభివృద్ధి శాఖ' పేరును "విద్యాశాఖ" గా మార్చడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
పూర్వాపరాలు :
- జాతీయ విద్యా విధానాన్ని తొలుత 1968లో, తర్వాత 1986లో రూపొందించారు. దానికి 1992లో పరిమితంగా సవరణలు చేశారు. ఒక రకంగా 1986 జాతీయ విద్యా విధానమే 34 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. దాని స్థానంలో కొత్త విధానం రూపొందించడానికి 'నరేంద్ర మోదీ' ప్రభుత్వం 2016 మే 27న 'టీ ఎస్ ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ', 2019 మే 31న 'కె.కస్తూరిరంగన్ కమిటీ' లను ఏర్పాటు చేసింది. 'కె.కస్తూరిరంగన్ కమిటీ' నివేదికను ఇప్పుడు ఆమోదించింది.
సంస్కరణలు
కొత్తగా 3 కోట్ల సీట్లు :
- 2035 నాటికి 'స్థూల నమోదు నిష్పత్తి' (GROSS ENROLLMENT RATIO) ని ఇప్పుడున్న 26.3% నుంచి 50% కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఉన్నత విద్యా సంస్థల్లో కొత్తగా 3 కోట్ల సీట్లు వస్తాయి.
- అన్ని కోర్సుల్లో 'హోలిస్టిక్, మల్టీ డిసిప్లినరీ' విద్యా విధానాన్ని తీసుకొస్తారు. సబ్జెక్టులను సరళంగా మారుస్తారు.
- 'యూజీ' (UG) కోర్సుల్లో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణలు (MULTIPLE ENTRY / EXIT) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడున్న విధానంలో 4 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆరు సెమిస్టర్ల తర్వాత చదువుకోలేని పరిస్థితి వస్తే పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఒక ఏడాది తర్వాత విద్యార్థి మానేస్తే "సర్టిఫికెట్" (CERTIFICATE) ఇస్తారు. రెండేళ్ల తర్వాత మానేస్తే "అడ్వాన్స్ డిప్లొమా" (ADVANCE DIPLOMA), 3-4 ఏళ్ల తర్వాత "డిగ్రీ" (DEGREE) అందిస్తారు.
- ఉద్యోగాలకు వెళ్లాలనుకున్న వారికి మూడేళ్ల డిగ్రీ, పరిశోధన రంగం వైపు వెళ్లాలనుకున్న వారికి నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాం అమలు చేయనున్నారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి ఓ ఏడాది పీజీ కోర్సు ఉంటుంది. దాని తర్వాత ఎంఫిల్ చేయాల్సిన అవసరం లేకుండానే 'పీహెచ్డీ' (PhD) కి వెళ్లొచ్చు. మాస్టర్స్ తో కలిపి అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ అమలు చేస్తారు. ఎంఫిల్ ను తొలగిస్తారు.
నిధుల పెంపుతో చేయూత :
- సాధ్యమైనంత త్వరగా 'జీడీపీ' లో 6% నిధులు విద్యారంగానికి కేటాయిస్తారు. ప్రస్తుతం - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 4.4% నిధులు ఇస్తున్నాయి.
- అమెరికాలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఉన్నట్లుగా దేశంలో 'నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్' ఏర్పాటు చేస్తారు. శాస్త్ర, సామాజిక శాస్త్రాల విభాగాల్లో చేపట్టే భారీ పరిశోధన కార్యక్రమాలకు దీని ద్వారా ఆర్ధిక చేయూత అందిస్తారు. పరిశోధన, నవ్యావిష్కరణలు, పేటెంటింగ్ లో ఈ ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తారు.
- విద్యా రంగాన్ని అంతర్జాతీయకరణ చేస్తారు. విదేశీ విద్యాసంస్థలు ఇక్కడ ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. విదేశీ విద్యార్థులు భారత్ కు వచ్చి చదువుకొనేలా ప్రోత్సహిస్తారు.
తెలుగులోనూ ఇ-కంటెంట్ :
- ఇప్పటి వరకు ఇంగ్లీష్, హిందీలకే పరిమితమైన ఈ-కంటెంట్ ను తెలుగుతోపాటు 8 భారతీయ భాషల్లో అభివృద్ధి చేసి అమల్లోకి తెస్తారు.
- అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో వర్చువల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తారు.
- విద్యా రంగంలో సాంకేతిక వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడానికి ప్రైవేటు, ప్రభుత్వ, సాంకేతిక రంగాన్ని ఒకే వేదిక మీదకి తెస్తూ 'నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం' ఏర్పాటు చేస్తారు.
పాఠశాల విద్యా విధానంలో .. :
- పూర్వ ప్రాథమిక విద్య (PRE-PRIMARY) ను సార్వత్రీకరిస్తారు. దీనికి సంబంధించిన పాఠ్యాంశాలను 'ఎన్ సీ ఈ ఆర్ టీ' (NCERT) అభివృద్ధి చేస్తుంది. 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు ఆటలు, కార్యకలాపాల ఆధారమైన సరళ పాఠ్యాంశాలను అమల్లోకి తెస్తారు.
- 1 నుంచి 3 తరగతులు చదివే 6-9 ఏళ్ల విద్యార్థులు ప్రాథమికమైన అక్షరాలు, అంకెలు సరిగా గుర్తుపట్టి చదివేలా, లెక్కలు చేసేలా తీర్చిదిద్ధేందుకు ఒక నేషనల్ మిషన్ ఏర్పాటు చేస్తారు. ప్రాథమిక దశలో విద్యార్థులు నిర్దేశిత పాఠ్యాంశాలను సరిగా నేర్చుకొనేలా తీర్చిదిద్దడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం.
- బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇప్పుడున్న 8, 10 తరగతుల నుంచి 12వ తరగతి వరకు పెంచుతారు.
- ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గించనున్నారు. ఏటా ఒకసారి కాకుండా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో విద్యార్థులకు రెండు స్థాయులు ఉంటాయి. బట్టీ పట్టే సామర్థ్యాన్ని కాకుండా వారిలోని తెలివితేటలను పరీక్షించేలా వీటిని తీర్చిదిద్దుతారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించేలా వాటిని నిర్వహిస్తారు.
పురోగతి నివేదికలూ మారిపోతాయి :
- విద్యార్థుల పురోగతి నివేదిక (PROGRESS REPORT) లో మార్పులు తెస్తారు. ఇప్పటివరకు విద్యార్థి మార్కులతోపాటు, వారి ప్రవర్తన గురించి టీచర్లు రాసే అభిప్రాయాలు మాత్రమే అందులో ఉంటున్నాయి. ఇకమీదట విద్యార్థి స్వీయ అభిప్రాయంతోపాటు, వారి సహాధ్యాయి, టీచర్ల అభిప్రాయాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఏటా విద్యార్థులు నేర్చుకోవాల్సిన 'జీవన నైపుణ్యాలు' (LIFE SKILLS) గురించి తల్లిదండ్రులతో మాట్లాడి నివేదిక రూపొందిస్తారు. 12వ తరగతి ముగించుకొని బయటికెళ్లే సమయానికి వారు ఏయే నైపుణ్యాలు నేర్చుకున్నారన్నది దానిలో నిక్షిప్తం చేస్తారు.
ఏ భాషనూ బలవంతంగా రుద్దవద్దు :
- త్రిభాషా సూత్రంతో సహా అన్ని స్థాయి తరగతుల్లో 'సంస్కృతం' ఉండేలా చూడాలని, దాన్ని ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలిపెట్టాలని కొత్త విధానం స్పష్టం చేసింది.
- ఇతర భారతీయ ప్రాచీన భాషలను ఎంచుకునే అవకాశాన్ని కూడా విద్యార్థులకు కల్పించాలని పేర్కొంది.
- విద్యార్ధులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దొద్దని స్పష్టం చేసింది.
- భారతీయ భాషలను విద్యార్థులు చాలా ఆనందంగా నేర్చుకునే వాతావరణాన్ని కల్పించాలని పేర్కొంది.
- పలు విదేశీ భాషలను నేర్చుకోవడానికీ వీలు కల్పించాలని సిఫార్సు చేసింది.
- దేశవ్యాప్తంగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ను ప్రామాణీకరించాలని పేర్కొంది. బధిర పిల్లల కోసం జాతీయ, రాష్ట్రస్థాయిల్లో పాఠ్యాంశాలు అభివృద్ధి చేయాలంది.
- భారతీయ భాషల సంరక్షణతోపాటు, వాటి వినియోగాన్ని పెంచి, వాటికి గతిశీలతను తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్లు నూతన విద్యా విధానం పేర్కొంది.
10+2+3 బదులు 5+3+3+4 :
- పాఠ్యక్రమాల నిర్మాణాన్ని పూర్తిగా మారుస్తున్నారు. ప్రస్తుతం 10+2+3 విధానం ఉంది. పదో తరగతి వరకు విద్యార్థులకు దశలవారీ పాఠ్యాంశాలు ఉంటాయి. ప్లస్ టూ కి వెళ్లిన వారికి ప్రత్యేక సబ్జెక్టులు వస్తాయి. ఇప్పుడు ఈ విధానాన్ని మార్చి 5+3+3+4 ఏళ్ల పాఠ్యక్రమ విధానాన్ని తీసుకొస్తున్నారు.
- ఇందులో 3 నుంచి 6 ఏళ్ల వరకు పిల్లలకు 'ప్లే స్కూల్' ఉంటుంది. వారికి 8 ఏళ్లు వచ్చేంతవరకూ ఆటలు, ఇతర కార్యకలాపాలు అనుభవ పూర్వకంగా నేర్చుకోవడం వంటివి ఉంటాయి.
- 3 నుంచి 8 ఏళ్ల లోపు వారు 'ఫౌండేషన్ స్టేజీ'లో, 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు 'ప్రిపరేటరీ స్కూలింగ్' లో, 11-14 ఏళ్ల వారు 'మిడిల్ స్కూల్' లో, 14-18 ఏళ్ల వారు 'సెకండరీ' స్థాయిలో ఉంటారు.
- 6 నుంచి 8 తరగతుల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతారు.
- 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఏ కూర్పులోనైనా సబ్జెక్టులు తీసుకోవచ్చు. అంటే ఫిజిక్స్ తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఆహార తయారీ కోర్సులు కానీ, ఇతర వృత్తివిద్యాకోర్సులు కానీ ఎంచుకోవచ్చు.
- విద్యాహక్కును 1 నుంచి 8వ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు విస్తరింపజేస్తారు.
డిజిటల్ లాకర్లలో పాత క్రెడిట్లు :
- ఒకటి రెండు సంవత్సరాలు చదివిన తర్వాత విద్యార్థులు ఏదైనా కారణాలతో చదువు మానేసినా, మళ్లీ తనకు వీలైన సమయంలో దానిని కొనసాగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అప్పటివరకు ఆ విద్యార్థి చదివిన ఒకటి, రెండు సంవత్సరాలకు సంబంధించిన క్రెడిట్స్ .. డిజిటల్ లాకర్స్ (DIGITAL LOCKERS) లో భద్రంగా ఉంటాయి. విద్యార్థి మళ్లీ తొలి సంవత్సరం నుంచి చదవాల్సిన అవసరం లేదు. అప్పటివరకు తన డిజిటల్ లాకర్ లో ఉన్న క్రెడిట్స్ ను ఉపయోగించుకొని మిగిలిన సంవత్సరాలు పూర్తిచేయొచ్చు.
ప్రాథమిక స్థాయి నుంచే సైన్స్ పై ఆసక్తి :
- సైన్స్, లెక్కలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే వారిని ప్రోత్సహిస్తారు.
- 6వ తరగతి నుంచి విద్యార్థులకు కోడింగ్ నేర్పిస్తారు.
- ప్రస్తుతం విద్యార్థులు సంగీతం, కళలు, ఆటలు, ఇతర ఆసక్తికర అంశాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల సైన్స్ పై ఆసక్తి, సమస్యలను పరిష్కరించే తత్త్వం, సంక్లిష్టమైన ఆలోచనా విధానంవారిలో తగ్గిపోతోంది. దీని దృష్ట్యా - ఇప్పుడున్న పాఠ్యాంశాలను అత్యవసర అంశాల వరకే పరిమితం చేసి మిగతా వాటిని తగ్గిస్తారు.
- వృత్తి విద్యా కోర్సులను 6వ తరగతి నుంచే ప్రారంభిస్తారు. ఇందులో ఇంటర్న్షిప్ (INTERNSHIP) సైతం ఉంటుంది.
యూజీసీ, ఏఐసీటీఈ ఉండవు :
- ప్రస్తుతం విద్యావ్యవస్థ నియంత్రణ కోసం 'యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి' వంటి వ్యవస్థలున్నాయి. వీటన్నింటినీ విలీనం చేసి మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
- అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే నిబంధనలు అమలు చేస్తారు.
మున్ముందు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలంటే .. :
- ఉపాధ్యాయ సామర్ధ్యాలపై 'జాతీయ నూతన విద్యా విధానం' లో ప్రత్యేక దృష్టి సారించారు. ఉపాధ్యాయుల నియామకాలను ఇకమీదట పారదర్శక-పటిష్ఠ పద్ధతిలో చేపడతారు. ఉదా :
- బోధన పట్ల నిబద్ధత, తపన ఉన్నవారినే ఉపాధ్యాయులుగా నియమిస్తారు.
- అకడమిక్ గా, బోధనాపరంగా, పరిశోధనపరంగా, ప్రజాసేవ పట్ల అంకితభావాలను కూడా పరీక్షించి తీసుకుంటారు.
- వారి సామర్ధ్యాల్ని మదించిన తర్వాతే పదోన్నతులు ఉంటాయి.
- ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రమాణాలను రూపొందిస్తారు.
మాతృ భాషకు, స్థానిక భాషకు ప్రోత్సాహం :
- భారతీయ భాషలకు, మాతృభాషలకు 'జాతీయ నూతన విద్యా విధానం' పెద్దపీట వేస్తోంది.
- కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలో కూడా మాతృభాష, భారతీయ భాషలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్సలేషన్, ఇంటర్ప్రెటేషన్' (IITI), పాళి, పర్షియన్, ప్రాకృతం, సంస్కృతాలకు సంబంధించి జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి .. అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో వీటి విభాగాలు ఉండేలా చూస్తారు.
- ఉన్నత విద్యలోని అనేక కోర్సులను మాతృభాషల్లో, స్థానిక భాషల్లో నిర్వహించేందుకు ప్రోత్సహిస్తారు.
3, 5, 8 తరగతుల్లోనే పరీక్షలు :
- 3, 5, 8 తరగతుల్లోనే స్కూల్ పరీక్షలుంటాయి. అవి కూడా నిర్దేశిత బోర్డు ద్వారా నిర్వహిస్తారు.
- 10, 12 తరగతులకు యధావిధంగానే పరీక్షలుంటాయి గానీ .. వాటి తీరు మారుతుంది.
- విద్యార్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే కాకుండా .. వారి జ్ఞానాన్ని, విశ్లేషణలను, ఇతరత్రా నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందుకోసం 'పరాఖ్' (విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, విశ్లేషించే సంస్థ) ను ఏర్పాటు చేస్తారు.
- ఆరో తరగతి తర్వాతి నుంచే వృత్తి విద్యలను అందరికీ పరిచయం చేస్తారు. అంటే 12వ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరికీ ఏదైనా ఓ వృత్తి విద్యలో ప్రవేశం ఉంటుంది.
ఎంబీబీఎస్ చేస్తూ కోడింగూ .. :
- ఇప్పటిదాకా వృత్తివిద్యా కోర్సులది పూర్తిగా ప్రత్యేక దారి.
- సాంకేతిక విద్య, లా, వ్యవసాయ విద్య, వైద్యం, ఆరోగ్యం .. ఇలా వేటికవే విడివిడిగా కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ఉన్నత విద్యలో భాగం చేసి .. 'మల్టీడిసిప్లినరీ' (MULTI-DISCIPLINARY) గా వెసులుబాటు కల్పిస్తారు. అంటే .. 'ఎంబీబీఎస్' (MBBS) చేస్తూనే కావాలంటే కోడింగ్ కూడా నేర్చుకోవచ్చు.
మార్పు ఇలా ...
| మారేదిలా .. | ఇప్పటి వరకు .. | ఇకముందు |
|---|---|---|
| బడిలో చేరాలంటే .. | 5 ఏళ్లు ఉండాలి | మూడేళ్లు నిండితే చాలు |
| నిర్బంధ విద్య | 6-14 ఏళ్ల వరకు | 3-18 ఏళ్ల వరకు |
| మాధ్యమం | నిబంధన లేదు | 5వ తరగతి వరకు మాతృభాషలో |
| వృత్తి విద్య | అమలులో లేదు | 6వ తరగతి నుంచి అమలు |
| సెమిస్టర్ విధానం | అమలులో లేదు | 9వ తరగతి నుంచి అమలు |
| ఇంటర్ విద్య | ఉన్నత విద్యలో భాగం | పాఠశాల విద్యలో చేరిక |
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి