ఈ బ్లాగును సెర్చ్ చేయండి

21, ఆగస్టు 2020, శుక్రవారం

NATIONAL RECRUITMENT AGENCY

జాతీయ నియామకాల సంస్థ 

(NATIONAL RECRUITMENT AGENCY)


  1. ఒకే దేశం - ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీ కోసం "జాతీయ నియామకాల సంస్థ" (NATIONAL RECRUITMENT AGENCY ⇒ NRA) ని ఏర్పాటు చేయాలని 2020 ఆగస్ట్ 19 న ప్రధాని 'నరేంద్ర మోదీ' అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది.
  2. రైల్వే (RRB), బ్యాంకింగ్ (IBPS), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కింద వేర్వేరుగా భర్తీ చేసే ఉద్యోగాలకు ఒకే ఉమ్మడి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఈ ఏజెన్సీ (NRA) ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి 'జితేంద్రసింగ్' వెల్లడించారు. దశలవారీగా ఈ సంస్థలను పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు.
  3. స్వతంత్ర భారతదేశంలో ఇదో విప్లవాత్మక సంస్కరణ.
  4. ఎన్ ఆర్ ఎ (NRA) పరిధిలోకి కేంద్ర ప్రభుత్వంలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు.
  5. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున సుమారు వెయ్యి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నచోట ఒకటికి మించి నెలకొల్పుతారు. గ్రామీణ అభ్యర్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత జిల్లాలోనే పరీక్ష రాయడానికి వీలవుతుంది.
  6. ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించే స్కోర్ మూడేళ్లు చెల్లుబాటవుతుంది. స్కోర్ పెంచుకోవడానికి అభ్యర్థులు మళ్లీ మళ్లీ పరీక్షలు రాయొచ్చు. అత్యుత్తమ స్కోర్ నే పరిగణనలో తీసుకుంటారు.
  7. ప్రస్తుతం 12 భాషల్లో పరీక్ష జరుగుతుంది. తర్వాత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో ఉన్న భారతీయ భాషలన్నింటిలో నిర్వహిస్తారు.
  8. వేర్వేరు రుసుములతో అనేకసార్లు పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు.
  9. ఆర్ ఆర్ బీ (RAILWAY RECRUITMENT BOARD), ఎస్ ఎస్ సి (STAFF SELECTION COMMISSION), ఐ బీ పీ ఎస్ (INSTITUTE of BANKING PERSONNEL SELECTION) కింద ఏటా 1.25 లక్షల గ్రూప్ - బి, సి ఉద్యోగాల ఖాళీలు ఏర్పడుతున్నాయి.
  10. వీటికి దాదాపు 3 కోట్ల మంది హాజరవుతుంటారు. ఖాళీల భర్తీకి 12-18 నెలల సమయం పట్టేది.
  11. నియామక పరీక్షల్లో ఒక అంచె తగ్గించడానికి ఈ మూడు సంస్థలకు (RRB, SSC, IBPS) కలిపి ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో స్కోర్ ఆధారంగా ఇవి తదుపరి పరీక్షలను వేర్వేరుగా నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు.
  12. ఎన్ ఆర్ ఏ (NRA) ను స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేస్తారు. చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి ఉంటారు. పాలకమండలిలో RRB, SSC, IBPS ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
  13. తొలి మూడేళ్లలో నిర్వహణకు రూ. 1,517.57 కోట్లు కేటాయిస్తారు.
  14. నూతన విధానం వల్ల తుది పరీక్షలు రాసే అభ్యర్థుల సంఖ్య 5 శాతానికి పరిమితం అవుతుంది.
  15. తొలిదశ పరీక్షను ఆన్లైన్ (ONLINE) లో నిర్వహిస్తారు. తక్షణం స్కోర్ లభిస్తుంది. దాని ఆధారంగా అభ్యర్థి ఈ మూడు బోర్డుల్లోని (RRB, SSC, IBPS) ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని, దానికి అవసరమైన తదుపరి దశ పరీక్ష రాయొచ్చు.
  16. ప్రస్తుతం ఈ ఏజెన్సీ (NRA) పరిధిని 3 నియామక బోర్డులకే (RRB, SSC, IBPS) వర్తింపజేస్తున్నారు. అంతా గాడిన పడుతున్నకొద్దీ కేంద్రంలోని 20 నియామక సంస్థలనూ దీని పరిధిలోకి తీసుకువస్తారు.
  17. అన్ని ప్రాథమిక పరీక్షలకూ ఒకే సిలబస్ ఉంటుంది. అభ్యర్థులు వేర్వేరుగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉండదు.
  18. ఉమ్మడి రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా అభ్యర్థులు తమకు సమీపంలోని కేంద్రాలను ఎంచుకోవచ్చు.
  19. ఒకే క్వశ్చన్ బ్యాంక్ (QUESTION BANK) ఉంటుంది. సురక్షితమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రీయంగా సర్వర్ ను నిర్వహిస్తారు.
  20. 117 ఆకాంక్షిత జిల్లాల నుంచి ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం పెంచడానికి ప్రత్యేక చేయూతనందిస్తారు. అక్కడి వారికి అవసరమైన సాయం చేయడానికి 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తారు. ఈ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలకు అవసరమైన వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం 'వ్యయ సర్దుబాటు నిధి' ఇస్తుంది.
  21. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.
  22. గరిష్ఠ వయోపరిమితి లోపు ఎన్నిసార్లయినా అభ్యర్థులు వీటిని రాయవచ్చు.
  23. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఇస్తారు.
  24. అభ్యర్థుల స్కోర్లు ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంటాయి. వీటి ఆధారంగా అవి నియామకాలు చేపట్టవచ్చు.
  25. రెండో దశ పరీక్ష అవసరం లేకుండా మొదటి దశలోని స్కోర్, వైద్య పరీక్షల ఆధారంగానే నియామకాలు చేసుకుంటామని కొన్ని సంస్థలు సూచనప్రాయంగా చెప్పడం అభ్యర్థులకు మరింత ఊరటగా ప్రభుత్వం పేర్కొంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి